• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

Share Button

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గ్రేడ్‌ను బట్టి రేటును నిర్ణయించారు. రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనాలని భావించినా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా కావడంతో అధికారులు వద్దని చెప్పినా వినకుండా రైతులు రబీలో వరి సాగు చేశారు. తీరా సాగునీరు సరిపోక చాలాచోట్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, పంట కోతదశలో ఉన్న సమయంలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటను తీస్తే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

రబీలో 11,993 హెక్టార్లలో సాగు

జిల్లాలో ఈ రబీలో 11,923 హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంటను సాగు చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపడం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందింది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నియోజకవర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కాల్వల ద్వారా చెరువులోకి నీటిని విడుదల చేశారు. కాల్వలకు సమీపంలో వ్యవసాయ భూములు కలిగిన రైతులు మోటార్ల ద్వారా వరి పంటకు సాగు నీటిని అందించారు. బోరుబావుల కింద కూడా వరి పంటలను సాగు చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 61 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఐకేపీ ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్‌ల ద్వారా 41 కేంద్రాలను ఏర్పాటు చేసి 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ప్రభుత్వం ఏ–గ్రేడ్‌ రకం వరి ధాన్యానికి రూ.1,770, బీ–గ్రేడ్‌ రకం ధాన్యానికి రూ.1,750 మద్దతు ధరగా నిర్ణయించింది. దానితో పాటు అనేక నిబంధనలు విధించింది. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ధాన్యం విక్రయించాలంటే నిబంధనలు పాటించాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం నాణ్యతగా ఉండటంతో పాటు 17శాతం కంటే తక్కువ తేమ ఉండాలని తప్పనిసరిగా ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

అయితే 61 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు కేవలం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో గంట్రావ్‌పల్లి, లక్నారంలో, మెప్మా ఆధ్వర్యంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో మాత్రమే ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే నాలుగు రోజులుగా కోత దశలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు. ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టేందుకు కూడా భయపడుతున్నారు. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో, ఎక్కువగా పంటలు ఉన్న ఊర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat