ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి.. 37.76 శాతం ఉత్తీర్ణత నమోదు.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు ఇదే!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం 60,600 మంది ఉత్తీర్ణులు కాగా.. వారిలో 32 మంది ఎ-గ్రేడ్, 71 మంది బి-గ్రేడ్, 60 మంది సి-గ్రేడ్, 54 మంది డి-గ్రేడ్లో ఉత్తీర్ణులయ్యారు. మిగతా 60,383 మంది విద్యార్థులు కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులయ్యారు.
> ఫలితాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్
> సెకండియర్ ఫలితాలు అందుబాటులో
> వారంలో ఫస్టియర్ ఫలితాాల వెల్లడి
> 37.76 శాతం ఉత్తీర్ణత నమోదు
> జులై 28 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుకు అవకాశం
తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఆదివారం (జులై 14న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఫలితాలను వెల్లడించారు. అయితే కేవలం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే విడుదల చేశారు. వారంరోజుల్లో మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను కూడా వెల్లడించనున్నట్లు అశోక్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,60,487 విద్యార్థులు హాజరుకాగా.. 60,600 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 37.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు హాజరైనవారిలో 63,308 మంది బాలికలకు గానూ.. 26, 181 మంది, అలాగే 97,179 మంది బాలురకు గానూ.. 34490 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.